1

1

Tuesday 12 January 2016

హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?

ఇదేం ప‌ద్ధ‌తో ఏంటో?
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాదీల‌ ఓట్లు రావ‌ని భ‌య‌మా?
లేక హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?
*******
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సెటిల‌ర్ల‌ను మ‌నం ఏమైనా అన్నామా? మా పొట్ట కొట్టే వారితోనే మా పంచాయితీ కానీ పొట్ట కూటి కోసం వ‌చ్చిన వారితో ఎలాంటి పంచాయితీ లేద‌ని మాత్ర‌మే క‌దా అన్న‌ది... ఇక 2009 ఎన్నిక‌ల్లో, 2014 ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ ప్ర‌చారం చేస్తూ సెటిల‌ర్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే మా పంటితో తీస్తామ‌ని, క‌డుపులో పెట్టుకుని చూస్తామ‌ని అన్నారు క‌దా.. తెలంగాణ వ‌చ్చాక అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లూ జ‌రిగాయి. కేసీఆర్ నాయ‌క‌త్వంలో 18 నెల‌లు సాఫీగా సాగింది. ఈ 18 నెల‌ల్లోనూ సెటిల‌ర్ల‌పై దాడులు జ‌ర‌గ‌లేదు.. వారిని ప‌ల్లెత్తు మాట అన‌లేదు.. మ‌రి ఉద్య‌మ స‌మ‌యంలో సెటిల‌ర్ల‌ను మ‌నం ఏదో అన్న‌ట్లుగా అవ‌న్నీ మ‌న‌సు లో పెట్టుకోవ‌ద్దంటూ ఈ మ‌ధ్య కాలంలో కేటీఆర్ గారు అన‌డం అస‌లు న‌చ్చ‌డం లేదు.. మ‌నం గ‌తంలో త‌ప్పు చేయ‌లేదు.. వ‌ర్త‌మానంలోనూ చేయ‌డం లేదు..
***********
ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లను చూస్తుంటే అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న మాట నిజ‌మేనేమో అన్న రీతిలో టీఆర్ఎస్ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం సాగుతోంది. హైద‌రాబాద్ అంతా మేమే(ఆంధ్రా సెటిల‌ర్లు) ఉన్నామ‌ని ల‌గ‌డ‌పాటి, ఇత‌ర ఆంధ్రా నేత‌లు అన్నారు.. ఆ స‌మ‌యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంత స‌ర్వే చేసినా 5 ల‌క్ష‌ల మందికి మించి లేర‌ని వాదించారు. మ‌రి హైద‌రాబాద్ లో కోటి మంది ఉంటే అందులో ఉన్న 5 ల‌క్ష‌ల మందిని ఊర‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం చేయ‌డం ఏంటి? ఈ త‌ర‌హా ప్ర‌చారం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ.. రానున్న రోజుల్లో యావ‌త్తు తెలంగాణ స‌మాజం ముందు మ‌ళ్లా మీరు ఏ మాట‌లు చెప్పి ప్ర‌చారానికి వెళ్తారో ఆలోచించుకోవాలి... సెటిల‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌నే రాజ‌కీయ నేత‌ల్లారా... ఏ త‌ప్పు చేశామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోర‌దాం అనుకుంటున్నారు... తెలంగాణ స‌మాజాన్ని అను నిత్యం అవ‌మానించిన పెద్ద మ‌నుషులు క‌నీసం తాము త‌ప్పుగా మాట్లాడామ‌ని ఇప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు.. అలాంటిది ఏ త‌ప్పూ చేయ‌ని మీరు మ‌నం అంతా గ‌తంలో త‌ప్పులు చేసిన‌ట్లుగా ఇప్పుడు మాట్లాడ‌టం అంటే అది తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే...
*****************
హైద‌రాబాద్ లో అంద‌రం సెటిట‌ర్ల‌మే అంటున్నారు కొంద‌రు.. తెలంగాణ జిల్లాల నుంచి వ‌చ్చిన వారు కూడా సెటిల‌ర్లే అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు.. తెలంగాణ జిల్లాల నుంచి వ‌చ్చి హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డిన వారు ఎప్పుడూ మేం సెటిల‌ర్ల‌మ‌ని భావించ‌లేదు.. మేం తెలంగాణ‌వాళ్లం, హైద‌రాబాదీలం అని మాత్ర‌మే భావిస్తున్నారు.. ఈ భావ‌న లోపించిన వారు మాత్ర‌మే తాము సెటిల‌ర్లం అని ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు.. ఇప్పుడు తెలంగాణ నేత‌లుకూడా తాము హైద‌రాబాద్ లో సెటిల‌ర్లం అన్న భావ‌న లో ఉంటే.. వారు తెలంగాణ లోని మిగ‌తా జిల్లాల ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతున్న‌ట్లే లెక్క‌.. !
నోట్ : హైద‌రాబాద్ లో ఏ ప్రాంతం నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డినా స‌రే తాము హైద‌రాబాదీల‌మ‌నో లేక తెలంగాణ వారిమి అన్న భావ‌న రాని వాళ్లే నా దృష్టిలో నిజ‌మైన సెటిల‌ర్లు..!!

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఇప్పుడు కూడా మీకు అర్ధం కావడం లేదా మీరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాంతీయ వాదం ఎంత బూటకమో!మా ఉద్యోగాలు దోచుకున్నారు అని గిర్గ్లానీ రిపోర్టు చూడమన్నారు మీవారే ఒకరు.చూస్తే "అన్యాయం ఒక్క తెలంగాణా ప్రాంతం వారికే కాదు అన్ని ప్రాంతాల వారికీ జరిగింది" అన్నాడు గిర్గ్లానీ గారు.మీ వాదననీ మీరు సపోర్టుగా తెచ్చుకున్న గిర్గ్లానీ గారి మాటనీ కలిపి చూస్తే తెలంగాణా వారికి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయానికి ఆంధ్ర ప్రానతం వారు కారణమైతే మరి ఆంధ్ర ప్రాంతం వారికి జరిగిన అన్యాయానికి తెలంగాణా ప్రాంతం వారు కారణం అయినట్టు కాదా,చెప్పండి!

    మా నీళ్ళు దోచుకున్నారు అని విడిపోయారు.ఎక్కువ నీటి కోసం ఇదివర్లో నాలుగ్ రాష్ట్రాల మధ్య అజరిగిన ఒప్పందాల్ని మార్చమంటున్నారు.అది నిజంగా సాధ్యపడుతుందనే అనుకుంటున్నారా మీరు?ఇదివరలో నాలుగు రాష్ట్రాలుగా భాగాలు పంచుకున్న నీటిని తెలంగాణా వాటా పెర్గడాని కనుకూలంగా అయిదు రాష్ట్రాల మధ్య పంచాలంటే ఆంధ్రా మా నీళ్ళూ దోచుకున్నారు అంటున్నందు వల్ల కిక్కురు మనకుండా వూరుకున్నా మిగతా మూడు రాష్ట్రాలూ తమ వాటా తగ్గించుకుంటాయా?వేరే రాష్ట్రంగా విడిపోయాక ఆంధ్రా మాత్రం వూరుకుంటూందా?అన్ని చోట్లా ప్రతిపక్షాలు ఉన్నాయి,ఏ మాత్రం అతమ రాష్ట్ర ప్రభుత్వం వూరుకుంటుంది?అందుకే కదా సమైక్య రాష్ట్రానికి దఖలు పడిన నీటినే ఈ రెండు తెలుగు రాష్ట్రాలూ పంచుకోవాల్సిందే తప్ప పాత ఒప్పందాన్ని తిరగదోడటం కుదరదంటున్నారు.

    ప్రాణహిత చెవెళ్ళ యేనా?ప్రాజెక్టుని సాక్షాత్తూ ముఖ్యమంత్రియే రంగం లోకి దిగి డిజైను మార్చి చివరి ముక్కని కత్తిరించారు,ఎందుకని?అరిచి గింజుకున్నా ఐంతకు మించి నీళ్ళు రావని కాదా!

    మీరు ఇదే బ్లాగులో సాక్షాత్తూ తెలంగాణ ప్రబ్బుత్వమే తెలంగాణ కాంట్రాక్టర్ల క్వాలిటీ బాగోలేదని ఇంకా ఆంధ్రా కాంట్రాక్తర్లకే అన్నీ కట్టబెడుతున్నది,మనవాళ్లని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది,లేకపోతే తెలంగాణా కాంట్రాక్తర్లు సబ్ కాంట్రాక్టర్లుగా మిగిలిపోతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు!ఎంత కాలమైంది మీకా అనుమానం వొచ్చి?పరిస్థితి ఏమన్నా మారిందా,తెలుసుకోండి!

    ReplyDelete
    Replies
    1. "ఇదివరలో నాలుగు రాష్ట్రాలుగా భాగాలు పంచుకున్న నీటిని తెలంగాణా వాటా పెర్గడాని కనుకూలంగా అయిదు రాష్ట్రాల మధ్య పంచాలంటే ఆంధ్రా మా నీళ్ళూ దోచుకున్నారు అంటున్నందు వల్ల కిక్కురు మనకుండా వూరుకున్నా మిగతా మూడు రాష్ట్రాలూ తమ వాటా తగ్గించుకుంటాయా?"

      ఏవా నాలుగు రాష్ట్రాలు ఏమిటా ఒప్పందం కాస్త చెపితే జవాబు ఇవ్వగలను.

      అసలు మీరు మాట్లాడుతున్నది ఏ పారివాహిక ప్రాంతం. గోదావరి జలవివాదంలో అప్పట్లో అయిదు రాష్ట్రాలు ఉండేవి. అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ & ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు కాలం చెల్లడం వలన ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకు చేరింది.

      గోదావరీ జలాల విషయంలో మొత్తం పదకొండు ఒప్పందాలు ఉన్నాయి. ఏ ఒక్క ఒప్పందం కూడా నాలుగు రాష్ట్రాల మధ్య కాదు.

      కృష్ణా జలాల విషయంలో రెండు ఒప్పందాలు ఉన్నాయి. మొదటిది గోదావరీ జలాలను కృష్ణా పారివాహిక ప్రాంతానికి తరలిస్తే ఆ నీటి వాత గురించి. రెండవిది మదరాసు నగారిని కోసం కొంత నీరు ఇవ్వడం గురించి. ఈ రెంటిలోనూ మూడు రాష్ట్రాలు ఉన్నాయి. నిజానికి కృష్ణా పారివాహిక ప్రాంతంలో అప్పట్లో మూడు ఇప్పుడు నాలుగు రాష్ట్రాలే ఉన్నాయి.

      Delete
    2. "ప్రాణహిత చెవెళ్ళ యేనా?ప్రాజెక్టుని సాక్షాత్తూ ముఖ్యమంత్రియే రంగం లోకి దిగి డిజైను మార్చి చివరి ముక్కని కత్తిరించారు,ఎందుకని?అరిచి గింజుకున్నా ఐంతకు మించి నీళ్ళు రావని కాదా!"

      కృష్ణా పారివాహిక ప్రాంతంలో ఉన్న చేవెళ్ళ లాంటి ప్రాంతాలకు గోదావరీ జలాలు తీసుకు రావడం మూర్ఖత్వం. రంగారెడ్డి జిల్లాలో షుమారు 3 లక్షల ఎకరా ఆయకట్టుతో తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి పథకం ఎంతో శ్రేష్టం. ఈ విషయాన్నిఎప్పటినుండో తెలంగాణా నీటి యోధులు చెప్తూనే వచ్చారు కానీ కృష్ణా జలాలను సీమకు మళ్ళించే కంకణం కట్టుకున్న వైస్సార్ పడనివ్వలేదు.

      తమ్మిడిహట్టి విషయంలో మీకేమన్నా ప్రశ్నలుంటే చెప్పండి వాటినీ నివృత్తి చేస్తాను.

      Delete
  3. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని అరెస్టు చేస్తే చూడాలని ముచ్చట పడుతున్న మీ విద్యార్హతా లోకజ్ఞానం ఏమిటి?అది జరిగితే దానికి కవుంతరుగా వేసిన టెలిఫోనూ ట్యాపింగు కేసులో కేసీఆర్ కూడా అరెస్టవుతాడు కదా!మీ ప్రాంతీయాభిమానం శాడిజం అయి చాలాకాలమైందని మీకు అనిపించడం లేదా?!

    ReplyDelete
  4. ప్ర‌ధాన మంత్రులుగా ప‌నిచేసిన వారే జైలు పాల‌య్యారు... సీఎంలు లెక్క కాదు.. త‌ప్పు చేసిన జ‌య ల‌లిత కూడా అరెస్ట‌య్యారు.. త‌ప్పు చేసిన వారు అరెస్టు కావాల‌ని కోరుకోవ‌డం శాడిజం అయితే నాది శాడిజ‌మని అంగీక‌రిస్తాను.. నా విద్యార్హ‌త‌, లోక జ్ఞానానికి ఓ కేసులో నిందితుడి అరెస్టును కోరుకోవ‌డానికి సంబంధం ఏంటో మీరే సెల‌వియ్యాలి...

    ReplyDelete